మహిళలకు సైబర్ నేరాలపై అవగాహన
తిరుపతి సిటీ
జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు మహిళా డీఎస్పీ శ్రీలత ఆధ్వర్యంలో మహిళలకు శక్తి టీమ్ పోలీసులు విస్తృతంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కరకంబాడి రోడ్లోని ట్రెండ్స్ షాపింగ్ మాల్ కార్మికులకు, అలాగే ఎయిర్ బైపాస్ రోడ్లోని రాస్ బిల్డింగ్ వద్ద ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలకు శక్తి యాప్ డౌన్లోడింగ్, సైబర్ క్రైమ్లు, లోన్ యాప్ మోసాలు, సోషల్ మీడియా మోసాల వల్ల కలిగే నష్టాలు, తెలియని లింకులు క్లిక్ చేయడం వల్ల జరిగే ప్రమాదాలు, మొబైల్ గేమ్స్కు దూరంగా ఉండటం, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, ట్రాఫిక్ నిబంధనలు, మహిళల భద్రత, మహిళలపై జరిగే నేరాలు, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాల నిరోధం వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే టోల్ ఫ్రీ నంబర్లు 112, 1930 (సైబర్ క్రైమ్), 1972 (డ్రగ్స్ సమాచారం), 1098 (బాలల సహాయం), 8099999977 వంటి నంబర్ల గురించి వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, ఏవైనా అనుమానాస్పద విషయాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, భద్రతా సూచనలు పాటించాలని శక్తి టీమ్ వారు సూచించారు.
