ప్రభుత్వంలోని అన్ని శాఖల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగించుకోవడం ద్వారా పాలనా సామర్థ్యాన్ని మరింత పెంచాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆర్టీజీఎస్, పబ్లిక్ పర్సెప్షన్ అంశాలపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డ్రోన్లు, సీసీ కెమెరాలు, శాటిలైట్ డేటాను అనుసంధానించే ఒక పటిష్టమైన మెకానిజం తీసుకురావాలని సీఎం సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించే క్రమంలో సాంకేతికతను జోడించి పనితీరును మెరుగుపరుచుకోవాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేస్తూ, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా బాణసంచా తయారీ కేంద్రాల్లో ప్రమాదాల నివారణకు తమిళనాడులోని శివకాశీలో ఉన్న రక్షణ చర్యలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. అలాగే రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికులకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ప్రయాణం సుఖమయంగా ఉండేలా చూడాలని ఆదేశించారు.
ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ‘వాట్సాప్ మనమిత్ర’ సేవలను విస్తృతం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ సేవల సంఖ్యను 953కి పెంచామని, వీటిని ప్రజలు సులభంగా వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సీఎం అధికారులకు చెప్పారు. ఇకపై సర్వేల పేరుతో ప్రజలను, సిబ్బందిని ఇబ్బంది పెట్టవద్దని, కేవలం కొత్త సమాచారం కోసం మాత్రమే సర్వేలు ఉండాలని తేల్చి చెప్పారు.
పెన్షన్ల పంపిణీలో ఎక్కడా లోటుపాట్లు ఉండకూడదని, ముఖ్యంగా వెనుకబడిన స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటించడం ద్వారానే సమస్యలపై పట్టు వస్తుందని, ప్రజల నాడిని అర్థం చేసుకుని ముందుకు సాగాలని ఆయన పునరుద్ఘాటించారు.
#ChandrababuNaidu #AndhraPradesh #AIGovernance #RTGS #SmartGovernance #APNews #DigitalIndia #PublicService #RTC #TechInGovernance
