పంట పొలాల్లోకి వచ్చిన అడవి దుప్పిని సురక్షితంగా అడవిలోకి పంపించిన ఫారెస్ట్ సిబ్బంది
బైరెడ్డిపల్లి
గొల్ల చీమనపల్లి గ్రామంలో గురువారం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి సమీపంలోని పంట పొలాల్లో ఉన్న రెడ్డప్ప రెడ్డి బావిలో అడవి దుప్పి (జింక) కనిపించడంతో గ్రామస్తులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. వెంటనే ఫారెస్ట్ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే బీట్ ఆఫీసర్ కుసుమకుమారి ఆధ్వర్యంలో ఫారెస్ట్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తుల సహకారంతో జాగ్రత్తగా చర్యలు చేపట్టి, దుప్పిని ఎటువంటి గాయాలు కాకుండా బయటకు తీశారు. అనంతరం ఆ దుప్పిని సమీప అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు.
ఈ కార్యక్రమంలో ఆర్ చంద్ర, ఎలిఫెంట్ వాచర్ చంగప్ప రామప్ప వాచర్లు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. అందరి సమన్వయంతో జరిగిన ఈ చర్యను స్థానికులు అభినందించారు.
వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అడవుల్లో నీటి కొరత అధికమవుతోంది. దాంతో అడవి జంతువులు ఆహారం, నీటి కోసం గ్రామాల వైపు వస్తున్నాయి. ఈ ఘటన కూడా అదే పరిస్థితికి నిదర్శనంగా నిలిచింది.
అడవి జంతువులను కాపాడడంలో ఫారెస్ట్ సిబ్బంది, గ్రామస్తులు కలిసి చూపిన చొరవ ప్రశంసనీయమని స్థానికులు పేర్కొన్నారు. అధికారులు కూడా ప్రజలు ఇలాగే సహకరించాలని కోరుతున్నారు. అనంతరం సమీపంలోని అడవిలోకి జింకను వదిలినట్లు ఫారెస్ట్ సిబ్బంది తెలియజేశారు
